కోవిడ్ కేర్ కేంద్రాల్లో యోగ కార్యక్రమాలు
శ్రీకాకుళం, మే 7 : శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ కేర్ కేంద్రాల్లో యోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున వసతులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
శ్రీకాకుళం సమీపంలో పాత్రునివలస టిడ్కో కోవిడ్ కేంద్రంలో 2 వేల పడకలుతో సిద్దం చేశారు. ఇప్పటికీ 845 మంది ఈ కేంద్రంలో చేరారు.
కేంద్రంలో చేరిన వారికి మంచి భోజనం, వసతి, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే
ఇందులో భాగంగా కోవిడ్ బాధితులు త్వరగా కోలుకొనుటకు, మానసిక ఆందోళన నుండి విరమింప చేయుటకు యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటి కార్యక్రమాలు ఇందులో ప్రారంభించారు.
టిడ్కో కేంద్రంలో శుక్రవారం కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ యోగా నిపుణులు డా.కృష్ణ కాంత్ గత మూడు వారాలుగా నిర్వహిస్తున్నారు.
కోవిడ్ కేర్ కేంద్రం నోడల్ అధికారి రవి కుమార్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమన్వయం చేస్తున్నారు. యోగ ద్వారా సాధారణమైన ఎక్సర్సైజులు చేయడంతో శారీరక వ్యాయామం జరుగుతుంది.
దాంతోపాటు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ప్రాణాయామం వలన శ్వాస క్రియ పెరగడంతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుటకు ఉపయోగపడుతుంది.
కరోనా వైరస్ ఊపిరితిత్తుల పైనే అధిక ప్రభావం చూపించడం అందరికీ తెలిసిందే. దీని నుండి రక్షణకు, వైరస్ ను పారద్రోలుటకు, ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.
కోవిడ్ బాధితులు సైతం యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా త్వరగా ఉపశమనం పొందగలరని భారత ప్రభుత్వ ఆయుష్షు వైద్య విభాగం సూచిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ యోగ, ప్రాణాయామం, ధ్యానం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.
సాధారణ ఆసనాలు చేయడం వలన కోవిడ్ బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి తాము మంచి సామర్థ్యంతో ఉన్నామని, వైరస్ నుండి ఉపశమనం పొందగలమనే విశ్వాసం ఏర్పడగలదని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ కేర్ కేంద్రాలతోపాటు ఆసుపత్రుల్లో మంచి సదుపాయాలు కల్పించుటకు, రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు సహాయ సహకారాలు అందించాలని అన్నారు.
ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొంటూ మాస్కు రక్షణ కవచం అని, దానిని వదలవద్దని, భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని కోరారు.