జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 7 వ తేదీ(ఆదివారం) మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థికసాయం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
నగరంలోని నెక్లెస్ రోడ్లో గల జలవిహర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల మరణించిన 75 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్యం, ప్రమాదాల భారిన పడిన 15 మంది జర్నలిస్టులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు
ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం..
దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం కొరకు జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఇందులో భాగంగా గత మూడు ఆర్థిక సంవత్సరాలలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల అయ్యాయని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద ఇప్పటివరకు 260 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ. 2 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేసినట్లు చెప్పారు.
అదేవిధంగా ఆయా కుటుంబాలకు ప్రతి నెల రూ. 3 వేల చొప్పున పెన్షన్ను ఐదు సంవత్సరాల పాటు అందజేస్తున్నామన్నారు.
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుకున్న 145 మంది విద్యార్థులకు నెలకు రూ. వెయ్యి చొప్పున ట్యూషన్ ఫీజును అందజేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు దాదాపు రూ. 10 కోట్ల ఆర్థికసాయం అందజేత..
దీనితో పాటు తీవ్ర అనారోగ్య కారణంగా పనిచేయలేని 93 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 50 వేల చొప్పున రూ. 46 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అకాడమీ అందజేసిందన్నారు.
కరోనా బారిన పడిన 1927 మంది జర్నలిస్టులకు రూ.3 కోట్ల 56 లక్షల 70 వేల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి రూ. 9 కోట్ల 84 లక్షల 7 వేల ఆర్థిక సహాయం జర్నలిస్టు కుటుంబాలకు అందజేసినట్లు అల్లం నారాయణ పేర్కొన్నారు.