రెండు నెలలు ఉచితంగా బియ్యం సరఫరా..
మండపేట: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, ఈ నేపధ్యంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రం తలపెట్టింది.
ఈ మేరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పేదలకు బియ్యం సరఫరా చేసేందుకు నిర్ణయించిందని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ కోన సత్యనారాయణ పేర్కొన్నారు.
మే జూన్ నెలలో 80 కోట్ల మందికి 5 కేజీల చొప్పున బియ్యం సరఫరా చేయాలని నిర్ణయించినట్లు కోన తెలిపారు.
కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రం సిధ్దమైందని, సెకండ్ వేవ్ తో మరోసారి ప్రజలంతా కష్టాల్లోకి వెళ్లడం, కొంతమందికి ఉపాధి లేకపోవడం, మరికొందరు పని ఉన్నా కరోనా భయంతో బయటకు రాలేని పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలియజేశారు.
