రాజమండ్రిలో గోవులకు అంతుచిక్కని అంటువ్యాధి కలకలం..!!
వైరాలజీ ల్యాబ్కు శాంపుల్స్ తరలింపు
సంఘటనపై దర్యాప్తుకు ఆదేశం
గోవుల కొట్టాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ మార్గాని భరత్
రాజమహేంద్రవరం, ఏప్రియల్ 22: రాజమహేంద్రవరంలోని నారాయణపురంలో ఒక ప్రైవేటు పశువుల శాలలోని గోవులకు అంతుచిక్కని అంటువ్యాధి సోకడంతో తీవ్ర కలకలం చెలరేగింది.
అంతుచిక్కని అంటువ్యాధితో విలవిలాడుతున్న మూగజీవాల వేదనను కళ్లారా చూసిన రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ ఆకస్మికంగా తనిఖీ చేసి పశుసంవర్ధక శాఖ అధికారులను రప్పించి వైద్య పరీక్షలకు ఆదేశించారు.
ఆవులకు సోకిన వింత అంటువ్యాధికి సంబంధించిన కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత పశువుల నుంచి సేకరించిన శాంపుల్స్ను విజయవాడలోని వైరాలజీ ల్యాబ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్విప్ మార్గాని భరత్ రామ్ వెల్లడించారు.
నగరంలోని నారాయణపురం ప్రాంతంలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన పశువుల కొట్టంలో ఆవులపై యాసిడ్ దాడి జరిగిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ మార్గాని భరత్ రామ్ గురువారం సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సంబంధిత పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ వైద్యులు డాక్టర్ వేణుగోపారావు, ఏడి రమేష్ చంద్ర, వెటర్నరీ డాక్టర్ లోకేష్ సమక్షంలో సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
పశువులపై నిజంగానే యాసిడ్ దాడి జరిగిందా? లేకా మరేదైన వ్యాధి శోకిందా? అనే దానిపై ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరా తీశారు. దీనిపై సంబంధిత పశువుల యజమానులతోను, స్థానికులుతోను ఆయన భేటీ అయ్యారు.
అయితే ఇందుకు సంబంధించి పశువైద్య రంగానికి చెందిన నిపుణులు సమాధానం ఇస్తూ ఆవులు, దూడలకు మాత్రమే వచ్చే ఒక అంటువ్యాధి అని, ఇటువంటి వ్యాధి లక్షణాలు గతంలో తెలంగాణలో వచ్చాయని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.
అయినా యాసిడ్ దాడా? లేకా అంటువ్యాధా? అనేది తేల్చేందుకు ఆయా ఆవుల నుంచి సేకరించిన శాంపుల్స్ను విజయవాడలోని వైరాలజీ ల్యాబ్కు పంపించినట్లు వారు ఎంపీకి వివరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ పశువులపై యాసిడ్ దాడి జరిగినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని సంఘటనా ప్రాంతానికి వచ్చినట్లు తెలిపారు.
ఇప్పటికే ఆవులపై యాసిడ్ దాడి జరిగిందా? లేకా ఏదైనా అంటువ్యాధి శోకిందా? అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టేందుకు గాయాలతో ఉన్న పశువుల నుంచి సేకరించిన శాంపుల్స్ను విజయవాడలోని వైరాలజీ ల్యాబ్కు తరలించినట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి నిర్వాహకులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, ఈ సంఘటనకు సంబంధించి సిసి పుటేజీను పరిశీలించాలని, ఈ కేసుపై దార్యప్తును వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
కావాలని ఎవ్వరైనా ఇటువంటి సంఘటనకు పాల్పడినట్లు తేలితే వారిపై ఖఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగనోహ్మన్ రెడ్డి ఇటువంటి సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఈ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైకాపా కో`ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.